ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో మైసూర్పాక్ పేరును మార్చాలని కొందరు సోషల్మీడియాలో ప్రతిపాదనలు చేశారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి దీనిపై మీమ్స్ కూడా చేశారు. అప్పట్లో ఇవి తెగవైరల్ అయ్యాయి కూడా… అయితే తాజాగా ఈ డిమాండ్ ఓ వ్యాపారికి బాగా నచ్చేసింది. అందుకే తమ దుకాణంలో విక్రయించే స్వీట్లలో ‘పాక్’ పదాన్ని తీసేసి కొత్త పేర్లు పెట్టారు. మైసూర్ పాక్ ను ‘మైసూర్ శ్రీ’గా మార్చేశారు. ఇక నుంచి దీన్ని ఈ పేరుతోనే పిలవాలని బొర్డుకూడా పెట్టేశాడు.
రాజస్థాన్లోని జైపుర్లో గల ప్రముఖ ‘త్యోహార్ స్వీట్స్’ యజమాని ఈమేరకు తమ దుకాణంలో మార్పులు చేశారు. మైసూర్ పాక్తో పాటు.. మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్ పేర్లను మార్చి.. మైసూర్ శ్రీ (Mysore Shree), మోతీ శ్రీ, ఆమ్ శ్రీ, గోండ్ శ్రీ అని కొత్త పేర్లు పెట్టారు. స్వర్ణ భాషం పాక్, చాందీ భాషమ్ పాక్ను కూడా స్వర్ణ శ్రీ, చాందీ శ్రీగా మార్చేశారు. దీనిపై ఆ దుకాణం యజమాని అంజలీ జైన్ మాట్లాడుతూ.. ‘‘దేశభక్తి అనేది కేవలం సరిహద్దుల్లో ఉంటే సరిపోదు. ప్రతి పౌరుడికి దేశంపై ప్రేమ ఉండాలి. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు.