Health alert: ఎక్కువసేపు కూర్చుంటే ఏమౌతుంది..?

By manavaradhi.com

Published on:

Follow Us
Sitting Too Much

టీవీ చూసేటప్పుడు, కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు, దాదాపు అందరూ కూర్చునే ఉంటారు. కానీ ఇలా కూర్చుని ఉండడం వల్ల మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు నడుము చుట్టు వచ్చి చేరుతుంది. ఫలితంగా స్థూలకాయం, రక్తంలో చెక్కర స్ధాయిలు ఎక్కువవడం, రక్తపోటు పెరగడం మొదలైన ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. రోజులో ఎక్కువ సమయం కూర్చునే ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అధిక సమయాన్ని కూర్చోవడానికే కేటయిస్తే మూత్రపిండాలకు సంబంధించిన రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా మహిళల్లో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ?

ఎక్కువ సేపు అదే పనిగా కూర్చుంటే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు చెప్తున్నారు. ఒకే చోట ఎక్కువ సమయం కూర్చోని వర్క్ చేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేపనిగా ఎక్కువ గంటలు కూర్చుంటే మధుమేహం బారిన పడే ప్రమాదం వుందని వారు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చుని పని చేసే వారిలో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కండరాలు క్రమంగా క్షీణిస్తాయి. మెడ, భుజం, తొడ ఇలా ప్రతి భాగంలోని కండరాలు తమ పటుత్వాన్ని కోల్పోతాయి. కండరాల క్షీణతతో పాటు ఎముకల సాంద్రతా తగ్గిపోతుంది.

ముఖ్యంగా ఎక్కువ గంటలు కూర్చునే వారిలో గుండెజబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలు పెరిగిపోతాయి. రక్తపోటు పెరిగిపోవచ్చు. అంతేగాకుండా.. రోజులో అధిక భాగం కూర్చుని వుండటం ద్వారా మానసిక సమస్యలు పెరుగుతాయి. ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. చాలా సేపు కదలకుండా కూర్చునే వారిలో కండరాలు బిగుసుకు పోవటం, వెన్నుముక, భుజాలు, తుంటి సమస్యలు రావటం వంటి ప్రమాదాలు పొంచి వుంటాయట. కాబట్టి గంటల కొద్దీ అలానే కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగడం ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు పరిశోధకులు.

రోజూ సాధ్యమైనన్ని సార్లు శరీరానికి శ్రమను కల్పించాలి. పనిచేసే చోట ఆఫీసైనా, ఇంట్లో అయినా అదే పనిగా కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి నిలబడడం, నడవడం లాంటివి చేయాలి. ఆఫీస్‌లో మంచినీళ్లు, టీ తాగాలంటే కుర్చీ వద్దకు తెప్పించుకోకుండా వాటి వద్దకు మనమే లేచి వెళ్లడం మంచిది. గంటల సేపు కుర్చీలకు అతుక్కుపోయేవారు.. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కూర్చునే విధానం సరిగ్గా వుండాలి. నిటారుగా కూర్చోవాలి. పాదాలు నేలకు తాకాలి. గంటకోసారి లేచి కనీసం ఐదు నిమిషాలైనా అలా నడవాలి. అప్పుడే ఒబిసిటీ సమస్య వేధించదని.. అనారోగ్య సమస్యలుండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అదే పనిగా కూర్చుని ఉండడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు తలత్తుతాయో తెలిసిందిగా. కాబట్టి ఇప్పటినుంచైనా ఎక్కువ సమయం పాటు అలాగే కూర్చుని ఉండం మానేయండి. వీలైనప్పుడల్లా అటు ఇటు అలా నడుస్తూ ఉండండి. శరీరానికి వ్యాయామం కల్పించండి. ఆరోగ్యంగా ఉండండి.

Leave a Comment