శంకరుడు జలలింగం రూపంలో ఆవిర్భవించిన క్షేత్రం జంబుకేశ్వరం. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో తిరువనైకావల్లోని ఆలయం పంచభూతాల్లో ఒకటైన జలానికి నిదర్శనంగా ఉంది. స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. పార్వతీ మాత అఖిలాండేశ్వరిగా జన్మించిన మహాపుణ్యక్షేత్రమిది. ఒక వైపు కావేరి నది, మరో వైపు కొలరున్ నదుల మధ్య ఏర్పడిన ద్వీపంలో జంబుకేశ్వరం ఉంది. తొలి చోళ రాజుల్లో ఒకరైన కొచెంగ చోళుడు నిర్మించినట్టు సంగం గ్రంథాల ద్వారా తెలుస్తోంది. శివభక్తులు నయనార్లు తమ గ్రంథాల్లో జంబుకేశ్వరుడిని స్తుతించారు.
మహదేవుని ఆజ్ఞ మేరకు అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరిగా జన్మించారు. నిత్యం శివుని ఆరాధనతో తరించేది. కావేరి నదిలోని జలంతో లింగాన్ని తయారుచేసి పూజలు చేయడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్తు అమ్మవారు పూజించిన లింగం కావడంతో పరమ పవిత్ర ప్రదేశంగా ఖ్యాతి చెందింది. అందుకనే అప్పుస్థలగా కూడా పిలుస్తారు. దీనికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. జంబు అనే మునీశ్వరుడు కఠోరంగా పరమేశ్వరుని దర్శనం కోసం తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై అతనికి కొన్ని పండ్లను కానుకగా ఇచ్చాడు. భగవంతుడు స్వయంగా ఇచ్చిన పండ్లు కావడంతో వాటి గింజలను బయటకు పడేయలేక మింగేస్తాడు. అనంతరం ఆ గింజల నుంచి వేర్లు శిరస్సు ద్వారా బయటకు రావడంతో ముని శివసాయుజ్యం పొందినట్టు తెలుస్తోంది. అందుకనే స్వామి జంబుకేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు.

జంబుకేశ్వరుని ఆలయ నిర్మాణ శైలి ద్రవిడ శైలిలో నిర్మించిన జంబుకేశ్వర దేవాలయం అత్యంత ప్రాచీన ఆలయాలలో ఒకటిగా పేరొందింది. గర్భగుడి ఆకారం చతురస్రాకారంలో ఉంటుంది. ఎత్తయిన గోపురాలతో, విశాలమైన ప్రాకారాలతో, వివిధమైన ఉపాలయాలతో, మండపాలతో, తీర్థాలతో సందర్శకులను ఎంతగానో అలరిస్తుంది. ఈ శివాలయం ప్రత్యేకత ఏమిటంటే.. దేవతా విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. ఆలయాల లోపల ఇలాంటి ఏర్పాటును ఉపదేశ స్థలం అంటారు. ఇక్కడ శివపార్వతిలతో పాటు బ్రహ్మ, విష్ణువు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయ గోడలపై దేవతామూర్తుల విగ్రహాలు కూడా చెక్కబడ్డాయి. ఈ ఆలయం లోపల మూలకాలలో నీటి మూలకాన్ని సూచించే ఐదు ప్రాంగణాలు ఉన్నాయి. ఆలయ ఐదవ సముదాయానికి రక్షణ కోసం భారీ గోడను నిర్మించారు, దీనిని స్థానిక ప్రజలు విబూది ప్రకాశంగా పిలుస్తారు.