విపరీతంగా కురుస్తున్న వానల వల్ల దోమల బెడద ఎక్కువవుతోంది. ఆసుపత్రుల్లో దోమ కాటుకు బలైన అనేకమంది ఆసుపత్రుల పాలైన సంఘటనలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. వయసుతో సంబంధం లేకుండా అందరినీ కలవరపెడుతున్న ఈ దోమల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
మన దేశంలో దోమల సంఖ్య మలేరియా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రపంచంలోని సగం జనాభా ఇంకా మలేరియా ముప్పును ఎదుర్కొంటోంది. ఏటా 4 లక్షల మందికిపైగా ప్రజలను బలి తీసుకుంటున్న ఈ వ్యాధి దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులను ఈ వ్యాధి ఎక్కువగా పొట్టనబెట్టుకుంటోంది. దోమ కాటు ద్వారా మలేరియా వ్యాపిస్తుంది. ఆడ అనాఫిలిస్ దోమ కుట్టినప్పుడు దాని శరీరంలోని ప్లాస్మోడియం సూక్ష్మజీవులు మానవ దేహంలోకి ప్రవేశిస్తాయి. మనిషి శరీరంలోకి చేరాక రక్తం నుంచి కాలేయంలోకి చేరతాయి. అక్కడ వాటి సంఖ్య వృద్ధి చెందుతుంది. సాధారణంగా ప్లాస్మోడియం శరీరంలోకి చేరిన వారం, పది రోజుల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఈ సమయంలో శరీరంలోని ప్లాస్మోడియం సూక్ష్మజీవులు తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. తర్వాత ఇవి ఎర్ర రక్త కణాల్లోకి ప్రవేశిస్తాయి. వీటి వల్ల ఎర్ర రక్త కణాలు పగిలిపోతుంటాయి. చలి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, ఛాతిలో నొప్పిగా ఉండటం, దగ్గు, చెమటలు పట్టడం, వాంతులు, విరేచనాలు, నీరసంగా ఉండటం, ఆయాసం మొదలైనవి మలేరియా లక్షణాలు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించడం వల్ల మెరుగైన చికిత్స అందిచొచ్చు.
దోమకాటుకు గురైన ఏడు నుంచి 18 రోజుల మధ్య మలేరియా లక్షణాలు కనిపిస్తాయి. రక్త నమూనాలను సేకరించి మైక్రోస్కోపిక్ ల్యాబోరేటరీ టెస్టులు లేదా ఆర్డీటీ టెస్టుల ద్వారా మలేరియా వ్యాధిని నిర్ధారిస్తారు. వేరే వ్యాధుల్లోనూ మలేరియా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి పారాసైటలాజికల్ టెస్టుల ద్వారా ఈ వ్యాధిని కచ్చితంగా నిర్ధారించొచ్చు. గర్భిణులు, చిన్నారులకు మలేరియా మరింత ప్రమాదకరం. మలేరియా బారిన పడిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే.. వ్యాధి సోకకుండా జాగ్రత్త వహించడం మేలు. ఇది ఎక్కువగా దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది.. కాబట్టి దోమలు ఉండకుండా చూసుకోవాలి. ఇందుకోసం పరిసరాలను పరిశుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు నిద్రించే సమయంలో దోమ తెరలను ఉపయోగించాలి. కిటీకీలు, తలుపులకు నెట్లు బిగించొచ్చు. మస్కిటో రిపెల్లెంట్స్ క్రీములు, స్ప్రేలు వాడటం ఉపకరిస్తుంది. ఘాటైన వాసనలను వెదజల్లే మొక్కలు, పుష్పాలను దోమలు ఇష్టపడవు. కాబట్టి బంతి రోస్మేరీ, పుదీనా మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఎక్కువగా ద్రవాహారం తీసుకోవడం ముఖ్యం. తద్వారా రోగనిరోధక వ్యవస్థ బలోపేతమై, రోగాల బారిన పడకుండా ఉంటాం. వీధుల్లో అమ్మే అపరిశుభ్ర ఆహారం తీసుకోవడం మానేయాలి. మలేరియా వ్యాధికి వ్యాక్సిన్ కూడా అందుబాటులో వచ్చింది. ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాక్సిన్ను ఉపయోగిస్తున్నారు. మలేరియా మరణాలు ఎక్కువగా ఉండే మలావి, కెన్యా, ఘనా తదితర ఆఫ్రికా దేశాల్లో చిన్నారులకు ఈ వ్యాక్సిన్ వేయిస్తున్నారు. దోమ చూడటానికి చిన్నదే.. కాని ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అది కుడితే మలేరియా వ్యాధి సోకడం ఖాయం. ఆడ ఎనాఫిలస్ దోమ కుడితే ఆ వ్యక్తి మలేరియా జ్వరం బారినపడినట్లు అర్థం. దోమల నివారణకు ఎన్నిరకాల కాయిల్స్, మందులు వాడినా, చివరికి దోమతెరలు కట్టుకున్నా అవి కుట్టడంతో జనం జ్వరాల బారినపడుతున్నారు. దోమల నివారణకు ప్రభుత్వ చర్యలేకాక, ప్రతీఒక్కరూ తమ చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, మురుగునీరు నిల్వ లేకుండా చూస్తే కొంతవరకు నివారించుకోగలం.
దోమల నివారణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదూ. ఇకనుంచి మీరు కూడా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. దోమల బారి నుంచి బయటపడండి.