ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ల వ్యవహారం హాట్టాపిక్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన దీని మీదే పెద్ద చర్చ నడుస్తుంది. అయితే ఇందులో కథానాయకుడు విజయ్ దేవరకొండ పేరు కూడా రావడం, కేసు నమోదైన నేపథ్యంలో ఆయన టీమ్ వివరణ ఇచ్చింది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యువతను చెడగొడుతున్నారని మియాపుర్కి చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ప్రమోషన్లను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదును స్వీకరించిన మియాపూర్ పోలీసులు.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖ తెలుగు నటులు రానా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్, ప్రణీత, శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్ల తదితరులపై కేసు నమోదు చేశారు.
కథానాయకుడు విజయ్ దేవరకొండ పేరు కూడా రావడం, కేసు నమోదైన నేపథ్యంలో ఆయన టీమ్ వివరణ ఇచ్చింది. కేవలం స్కిల్ బేస్డ్ గేమ్స్కు మాత్రమే ఆయన ప్రచారం నిర్వహించారని తెలిపింది. ఆ కంపెనీ చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
‘‘విజయ్ దేవరకొండ స్కిల్ బేస్డ్ గేమ్స్కు మాత్రమే ప్రచారం నిర్వహించారు. ఆ కంపెనీలను చట్టప్రకారమే నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ ప్రచారకర్తగా వ్యవహరించారు. ఆయన ఏ ప్రకటన చేసినా, కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా సదరు సంస్థ న్యాయపరంగా వ్యవహరిస్తున్నాదా?లేదా?అన్నది విజయ్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ఉత్పత్తి చట్టప్రకారం అనుమతి ఉందని తెలిసిన తర్వాతే విజయ్ దానికి ప్రచారకర్తగా ఉంటారు. అలాంటి అన్ని అనుమతులు ఉన్న ఏ23 అనే సంస్థకు బ్రాండ్కు విజయ్ అంబాసిడర్గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు కూడా తెలియజేసింది. ఏ23 అనే కంపెనీతో విజయ్తో ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థకూ ఆయన ప్రచారకర్తగా వ్యవహరించడం లేదు’’- టీమ్ విజయ్ దేవరకొండ