‘‘తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి అధికారులను ప్రతిసారీ మనం అడుక్కోవడమేంటి? వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ (యాదగిరిగుట్ట దేవస్థానం) లేదా? భద్రాచలంలో రాముడు లేడా? : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తిరుమల దర్శనాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం గురించి ఏపీ ప్రభుత్వాన్ని, టిటిడి అధికారులను ప్రతిసారీ అడుక్కోవడమేంటి? వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ (యాదగిరిగుట్ట దేవస్థానం) లేదా? భద్రాచలంలో రాముడు లేడా? మనకు శివాలయాలు తక్కువున్నాయా? తిరుమలకు వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చు. తెలంగాణకు అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఉంది. మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. సిలికాన్ వ్యాలీయే ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. నిన్ననే మెక్డొనాల్డ్ కంపెనీ వచ్చింది’’ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో గురువారం నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండుగ’ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య, కొత్త నియామకాలకు సంబంధించి 922 మందికి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలకు వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చని అన్నారు. తెలంగాణకు అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఉందని, మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీనే ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందని చెప్పారు. మెక్ డొనాల్డ్ కంపెనీ నిన్ననే రాష్ట్రానికి వచ్చిందని రేవంత్రెడ్డి తెలిపారు.