ఇటీవల జరిగిన ‘రెట్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలపై విజయ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదని విజయ్ వెల్లడించాడు.
‘‘నేను ‘రెట్రో’ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీసినట్లు నా దృష్టికి వచ్చింది. వీటిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ వర్గాన్నీ, ఏ తెగనూ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. వారిని నేను ఎంతో గౌరవిస్తాను. భారత దేశంలోని ప్రజలంతా ఒక్కటేనని భావిస్తాను. మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఐక్యంగా నిలబడాలి. నేను ఏ సమూహంపై ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ వివక్ష చూపలేదు. వారందరూ నా కుటుంబ సభ్యులు, నా సోదరులే అని అనుకుంటాను. నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను. శాంతి గురించి మాట్లాడడమే నా ఏకైక లక్ష్యం’’
ఇక, తాను ‘ట్రైబల్స్’ అనే పదం వాడడం వెనుక ఉద్దేశాన్ని కూడా విజయ్ దేవరకొండ వివరించారు. “హిస్టారికల్, డిక్షనరీ సెన్స్లోనే నేను ఆ పదాన్ని వాడాను. వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. ఆ సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. అసలు నాగరికత మొదలు కాక ముందు క్లాన్స్, రాజ్యాలు అంటూ ఉండేవి. అంతే తప్ప షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించడం మొదలుపెట్టిన తర్వాత ఇలా వర్గీకరణ అనేది జరిగింది. అలా జరిగి కనీసం 100 ఏళ్లు కూడా పూర్తి కాలేదు” అని రౌడీబాయ్ వివరణ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ ఆ ఈవెంట్లో మాట్లాడుతూ.. గిరిజనులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ ట్రైబల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాది కిషన్రాజ్ చౌహాన్, ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.