జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ దేశ భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పాకిస్తాన్ నుండి వచ్చే అన్ని వస్తువుల దిగుమతిని నిషేధించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ప్రకటించారు.
పాకిస్థాన్లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి భారత్కు వచ్చే అన్నిరకాలా వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం. అనుమతులు ఉన్న ఉత్పత్తులైనా, స్వేచ్ఛాయుత దిగుమతులైనా సరే పాక్ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతించబోం. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే.. భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి’’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ నోటిఫికేషన్లో వెల్లడించింది.
అంతేకాదు .. పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాలను భారత్ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. మర్చెంట్ షిప్పింగ్ చట్టం, 1958లోని 411 సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అటు భారత ఓడలు కూడా పాక్ పోర్టుల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే పాక్ విమానాలకు మన గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే.

భారత్-పాకిస్థాన్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారీ-వాఘా సరిహద్దు. ఇప్పటికే దాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఇక, 2019లో పుల్వామా దాడి తర్వాత నుంచి దాయాది నుంచి మనం చాలావరకు దిగుమతులు తగ్గించుకున్నాం. పాక్ ఉత్పత్తులపై కేంద్రం 200శాతం సుంకం విధించింది. కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనెగింజల వంటి వాటిని మాత్రమే దాయాది నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.
గణాంకాల పరంగా చూస్తే కూడా.. ఈ దిగుమతుల విలువ చాలా తక్కువే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్కు 447.65 మిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతి కాగా.. అక్కడినుంచి కేవలం 0.42 మిలియన్ డాలర్ల ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.1శాతం మాత్రమే.
CM Revanth Reddy: తిరుమల దర్శనాల కోసం మనం వాళ్లను అడుక్కోవడమేంటి