మనిషికి కళ్లు ఎంతో ముఖ్యం. నేటి ఆధునిక జీవితంలో ఎక్కువగా చదవడం.. రాయడం.. టీవీ చూడడం.. కంప్యూటర్ పై పనిచేయడం… ఇలా కంటితో ముడిపడే పనులను ఎన్నో చేస్తున్నాం. కళ్లకు కలిగే నిరంతర శ్రమను అంచనా వేయలేం. ఫలితంగా చిన్నవయసులోనే కంటిసంబంధ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కంటి చూపు మందగించకుండా ఏంచేయాలి…? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కంటి చూపును కాపాడుకోవచ్చు..?
మన శరీరంలోని అన్ని అవయవాల కన్నా కంటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అన్నింటికీ కంటి చూపు ప్రధానం. కళ్ల ముందున్న ప్రపంచాన్ని చూసే అదృష్టం నూటికి నూరు శాతం మందికీ లేదు. ఆ అదృష్టం ఉన్నవారు దాన్ని కాపాడుకునేందుకు ఎంతో శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. కంటి సమస్య చిన్నదైనా సరే ‘ఆ ఏముందిలే’ అని తీసిపారేయవద్దు. తొలినాళ్లలో వచ్చే చిన్నపాటి సమస్యలే కంటి పాలిట శాపాలుగా పరిణమించి కంటిచూపు మందగించేందుకు దోహదపడుతున్నాయి. ఏడాదికోసారి కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటి సమస్యలను గుర్తించవచ్చు. కొన్ని సమస్యలు బయటకు కనిపించకుండా హానిచేస్తాయి. కంటిచూపునకు గల కారణాలలో ఒకటి కన్ను పొడిబారడం. కార్నియా, కళ్ళ ముందు గోపురం ఆకారంలో ఉండే ఉపరితలం, స్పష్టంగా చూడటానికి ఎప్పుడూ సరళంగా ఉంచడం చాలా అవసరం.
నేటితరంలో యువత ఎక్కువగా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లకే అతుక్కుపోతుండటంతో ఎక్కువమందికి నేత్ర సంబంధమైన సమస్యలు వస్తున్నాయి. కంప్యూటర్ల ముందుగానీ, స్మార్ట్ఫోన్లపైగానీ ఎక్కువ సమయం పనిచేయడం వలన కంటిపై తీవ్రమైన ఒత్తిడి పడి తడారిపోతాయి. ఇలా తదేకంగా పనిచేయకుండా ప్రతి 20 నిమిషాలకు ఓసారి కళ్లకు విశ్రాంతి నివ్వాలి. కంటిచూపు మందగిస్తున్న విషయం మనకు వెంటనే తెలిసిరాదు మనం చదువుతున్నప్పుడు, వాహనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న వస్తువు మసకగా మారుతాయి. టీవీ చూస్తున్నప్పుడు చాలా దగ్గరగా కూర్చోవడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 3 డీ విడియో గేమ్స్ ఆడటం, సినిమాలు చూడటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే విశ్రాంతి లేకుండా గంటల పాటు పనిచేయడం వలన కన్ను దెబ్బతింటుంది.
కంటి చూపులో ముఖ్యమైన కార్నియా చుట్టూ కాంతి వలయాలు ఏర్పడుతున్నట్టుగా అనిపిస్తే తప్పనిసరిగా కంటిచూపు మందగించినట్టు భావించాలి. కాంతి వలయాలు కన్ను పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పడానికి సూచికలు. కాటరాక్ట్ రావడానికి, గ్లకోమాకు అవకాశం ఉంటుందని గమనించి వెంటనే కంటివైద్యుడ్నిసంప్రదించి తగు చికిత్స పొందాలి. వయసు పెరిగినకొద్ది కంటిలో రక్తనాళాల ముద్దలు ఏర్పడటం సహజం. అయితే పెద్దపరిణామంలో జరిగినప్పు చికిత్స పొందడం అవసరం. కళ్లను యూవీ రేస్ నుంచి కాపాడుకోవడానికి, దుమ్ము ధూళి పడకుండా ఉండేందుకు కంటి అద్దాలు వాడుకోవాలి. ఇతరత్రా సమస్యల కారణంగా వైద్యుడు సూచనల మేరకు కంటి అద్దాలను వాడాలి. ఆకుపచ్చ ఆకుకూరలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే చేపలు వంటివి తీసుకోవాలి. కంటి చూపు మెరుగుకు క్యారట్, మొలకెత్తిన గింజలు ఎక్కువగా తినాలి.
చూపు మసకబారడం అనే సమస్య రోజువారీ విధుల నిర్వహించడంలో ప్రతిబంధకంగా మారుతుంది. కంటి పరిశుభ్రతపై ఎక్కువ దృష్టిసారించడం ద్వారా కంటిచూపు మందగించకుండా చూసుకోవచ్చు. ఏడాదిలో కనీసం రెండు సార్లైనా కంటి వైద్యుడ్ని సంప్రదించి తగు సలహాలు పొందాలి.








