Thalassemia – తలసేమియా వ్యాధిపై అవగాహన

By manavaradhi.com

Published on:

Follow Us
Thalassemia

తల్లి ఒడిలో జోల పాట వింటూ హాయిగా సేద తీరుతూ నిదురించాల్సిన పసి మొగ్గలకు చెప్పలేనంత బాధ. ఆ నరకం అనుభవిస్తున్న చిన్నారికి లెక్కలేనన్ని సార్లు తూట్లు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. ఇది పసి పిల్లలనే కాదు వారి తల్లితండ్రుల హృదయాలనూ కలిచివేసే దుఃఖం. అదే తలసీమియా.

తలసేమియా అంటే గ్రీకుభాషలో సముద్రం అని అర్థం. నిజంగానే సముద్రంలా ఇది అంతులేని సమస్య. సముద్రంలా ఆటుపోట్లతో కూడిన వ్యాధి ఇది. తలసేమియా పిల్లల జీవితాలు పౌర్ణమి – అమావాస్యలను తలపిస్తాయి. ఒంటినిండా రక్తం ఉన్నప్పుడు.. బిడ్డ పున్నమి చంద్రుడిలా కళకళలాడుతుంటాడు. హుషారుగా కన్పిస్తాడు. రక్తం తగ్గిపోయే కొద్దీ అమావాస్య చంద్రుడిలా నీరసించిపోతాడు. ఇది జన్యు సంబంధమైన వ్యాధి. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే రక్తపిశాచి.

దురదృష్టం ఏమిటంటే, ప్రాణంపోసే కన్నవారి ద్వారానే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది. తలసేమియా జన్యువాహకులైన తల్లిదండ్రులద్వారా సంక్రమిస్తుంది. బిడ్డల్లో పాతిక శాతం మంది పుట్టకతోనే వ్యాధిగ్రస్తుల అవకాశం ఉంది. మిగతా పాతిక శాతం మంది సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. మరో యాభై శాతం కేవలం వాహకులు మిగిలిపోవచ్చు. వీరికి పెద్దగా సమస్యలు ఉండవు. కానీ మరో వాహకుడి ద్వారానో వాహకురాలి ద్వారానో కలిగిన సంతానానికి మాత్రం తలసేమియా వచ్చే అవకాశం ఉంది. మనదేశంలో ఆరు కోట్లమంది తలసేమియా వాహకులు ఉన్నారు.

తలసేమియా రోగులకు జీవితాంతంతలసేమియా ప్రభావం రక్తంపై పడుతుంది. మనం పీల్చుకునే ప్రాణవాయువును రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ అందించే బాధ్యత హిమోగ్లోబిన్దే. తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత మేర హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. తయారైనా ఎక్కువకాలం మనలేదు. ఫలితంగా హిమోగ్లోబిన్ నిల్వలు దారుణంగా పడిపోతాయి. అలా పడిపోయిన ప్రతిసారీ కృత్రిమంగా అందించాల్సి ఉంటుంది. అందకపోతే ప్రాణం పోతుంది. ఏటా దేశంలో 12000 చిన్నారులు తలసేమియాతో పుడుతున్నారనీ, అందులో వెయ్యిమంది తెలుగు రాష్ట్రాల్లో పుడుతున్నారనీ లెక్కలు చెబుతున్నాయి.

రక్తం ఎక్కించాలి. మరోదారి లేదు. తలసేమియా రోగులకు తప్పనిసరైన శుద్ది చేసిన రక్తం హైదరాబాద్లోనే ఉచితంగా దొరుకుతుంది. మరి ధనంవతుల సంగతి సరే. నిరుపేదల పరిస్థితేమిటి? పనులు వదలుకుని పట్టణాల చుట్టూ తిరగడం ఎలా సాధ్యం? రక్తం వరకూ హైదరాబాద్లోని తలసేమియా సొసైటీ సమకూరుస్తుంది. నెలనెలా ఖరీదైన మందులు కొనా లి. రక్తం ఎక్కించిన ప్రతిసారీ ల్యూకో డిప్లీషన్ ఫిల్టర్స్ వాడాలి. క్రమం తప్పకుండా దంత, గుండె, మూత్రపిండాల, కాల్షి యం, ఫాస్పరస్ స్థాయిలను తెలిపే పరీక్షలూ చేయిస్తుండాలి. వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అప్పడే ఆ బిడ్డ ఆరోగ్యం గా ఉంటాడు. లేదంటే ఏదో ఓ రోగం వస్తుంది. తలసేమియా పిల్లలకు వ్యాధి నిరోధకత తక్కువ. నెలకు సుమారు రూ.5 వేల నుంచి రూ.10 వేల దాకా మందులకు ఖర్చవుతుంది.

తలసేమియా వ్యాధి జన్యుపరమైనది. ఈవ్యాధి ముఖ్యం గా రెండు రకాలు. వాటిలో మొదటిది తలసేమియా ట్రైట్, తలసేమియా మైనర్, తలసేమియా కారియర్. రెండోది తలసీమి యా మేజర్. తలసేమియా వ్యాధి ముఖ్యంగా మేనరికపు వివాహాల వల్ల వస్తుంది. అలా అని బయట వారిని వివాహం చేసుకుంటే ఈ వ్యాధి సోకదని చెప్పలేం. తలసేమియా కారియర్ వల్ల ఎలాంటి చెడూ జరగదు. ఈ వ్యాధి ఉన్నట్లుగా పరీక్ష చేయించుకుంటే తప్ప తెలియదు. రెండో రకం.. తలసేమియా మేజర్ అత్యంత భయంకరమైన ప్రాణాంతక వ్యాధి. ఈవ్యాధి సోకిన వ్యక్తి రక్తహీనతతో బాధపడుతుంటారు. ఈ వ్యాధి చిన్నారులలో 3 నెలల వయస్సు నుంచి 18 నెలల వయస్సు మధ్య బయటపడుతుంది. కుటుంబంలో మేనరికపు వివాహాలు జరిగితే వారికి పుట్టబోయే పిల్లలకు తలసేమియా కారియర్ రావచ్చు. లేదా సాధారణంగా రావచ్చు. అలాగే తలసేమియా కారియర్ కుటుంబంలోని ఒక వ్యక్తి వారి బంధువు కాకున్నా మరో తలసీమియా కారియర్ కుటుంబంలోని వ్యక్తిని వివాహం చేసుకుంటే వారికి పుట్టే సంతానం కూడా తలసీమియా కారియర్గా, మేజర్గా, సాధారణంగా కూడా పుట్టవచ్చు. మేనరికపు వివాహాలు కాకున్నా ఆరోగ్యవంతులైన సంతానం నిమిత్తం ఎలక్ట్రోపోరసిస్ అనే రక్త పరీక్ష అనంతరం వివాహం చేసుకోవడం మంచిది.

తలసేమియా మేజర్ బాధితులు రక్తహీనతతో బాధపడతారు. ఈవ్యాధి సోకకుండా నివారించవచ్చు. కానీ వ్యా ధి సోకిన తరువాత ఇప్పటి వరకు పూర్తిగా నయం చేయగల చికిత్స లేదు. వారి జీవిత కాలాన్ని పొడిగించాలంటే 15 నుంచి 20 రోజులకు ఒక్కసారి రక్తం ఎక్కించుకుంటూ హెచ్బీ 9 శాతం తగ్గకుండా ఉండటానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేస్తుండాలి. రక్తం ఎక్కించాల్సిన ప్రతిసారీ వీరికి చేసిన రక్త శుద్ది కెడ్ సెల్ రక్తాన్ని ఫిల్టర్ బ్యాగ్స్ ద్వారా ఎక్కించాలి. ఈ బ్యాగ్స్ కూడా చాలా ఖరీదుతో కూడకున్నవి. దీనికి మరో రకమైన చికిత్స బోన్మ్యారో .ఇది చాలా ఖరీదైన ఆపరేషన్. దీనికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చువుతుంది. అంత ఖర్చుచేసి ఆపరేషన్ చేయించినా దాని సక్సెస్ రేటు 20 నుంచి 30 శాతం వరకేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల రక్తం ఎక్కించుకునే ప్రక్రియకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులను ప్రభుత్వం ఆదుకోవాలి. మేనరికపు వివాహాలను వ్యతిరేకించాలి. వాటిని ప్రోత్సహించకూడదు. పెళ్లికి ముందు ఆడ, మగ హెచ్బీఏ 2 అనే పరీక్షను చేయించుకోవాలి. టెస్ట్లో ఇద్దరికి పాజిటివ్ వస్తే వారు ఎట్టి పరిస్ధితులలో పెళ్ళి చేసుకొకూడదు. అదే విధంగా తలసేమియా సోకిన పిల్లలకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయిస్తూ రక్తం ఎక్కించాలి. రక్తం ఎక్కించిన తరువాత వారిలో ఐరన్ లోడ్ పెరగకుండా ఐరన్ ఛీల్లేషన్ టాబ్లెట్లను వాడాలి.

తలసేమియా వ్యాధిగ్రస్తులకు జీవితాంతం రక్తం ఎక్కించాలి. రక్తం ఎక్కించిన తరువాత ఐరన్ లోడ్ పెరగకుండా ఐరన్ ఛీల్లేషన్ టాబెట్లు వాడాలి ఇందు కోసం ప్రతినెలా రూ.5 వేల నుంచి రూ. 8 వేల వరకు ఖర్చు అవుతుంది. వీరిని కూడా ప్రత్యేక కేటగిరి కింద పరిగణించి సదరం సర్టిఫికెట్లను అందిం చి ప్రభుత్వం సహాయం అందించాలి.

Leave a Comment