ప్రస్తుత కాలంలో కంప్యూటర్లు మన దైనందిన జీవితంలో కీలకపాత్రను పోషిస్తున్నాయి. చాలామంది కంప్యూటర్ ల ముందు ఆఫీసుల్లోనే కాదు ఇంట్లో కూడా గంటలకొద్ది కూర్చొని పనిచేస్తున్నారు. వెబ్ బ్రౌజింగ్, సోషల్ నెట్వర్కింగ్ , గేమ్లు కోసం ఎన్నో రకాల డిజిటల్ డిస్ప్లే పరికరాలను ఉపయోగిస్తున్నాము. ఇలా కంటిన్యూగా కంప్యూటర్స్ వాడటం వల్ల మనకు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ సమస్య వస్తుంది.
నేడు చాలామంది చిన్నారులు హైపర్ ఆక్టివ్ తో పుడుతూ అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. వీరిలో దాదాపు 80% మంది హైపర్ ఆక్టివ్ పిల్లలు ఉంటున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. చిన్నారులు రోజులో దాదాపు 10 గంటలు కంప్యూటర్స్, టివీల ముందు గడుపుతూ కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. కేవలం పిల్లలే కాదు ఉద్యోగస్తులు కూడా తమ టైమంతా కంప్యూటర్లతోనే గడిపేస్తు జాగ్రత్తలు పాటించడం లేదు. ఇలా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే సమస్య వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి యేటా సుమారు 10 మిలియన్ల మంది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్కు గురవుతున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రతిరోజూ మూడు గంటలకు మించి కంప్యూటర్పై పనిచేసే వారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
సివిఎస్ సమస్య ఉత్పన్నమవడానికి కంప్యూటర్ స్క్రీన్నుంచి వెలువడే రేడియేషన్ ఒక ప్రధాన కారణం. పరిసరాల వెలుతురులోని హెచ్చుతగ్గులు, కంప్యూటర్ అమరిక, కంప్యూటర్ ముందు కూర్చునే విధానం, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్ మీద పని చేయడం వంటి కారణాలతో పాటు దృష్టి లోపాలు కూడా సివిఎస్ రావడానికి కారణమవుతాయి. ఎక్కువ సమయం పాటు ఈ స్క్రీన్లను చూసే వారు కంటి సంబంధిత సమస్యల పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- • సరి చేయని లేదా స్వల్పంగా సరి చేసిన కళ్ళద్దాల శక్తి వలన
- • మానిటర్ నుండి అత్యధిక వెలుగు లేదా పరావర్తనం
- • కళ్లకు మరియు మానిటర్కు మధ్య దూరం
- • కంప్యూటర్ను సరైన రీతిలో అమర్చకపోవడం లేదా ఉపయోగించకపోవడం
- • స్క్రీన్పై ఎక్కువసేపు దృష్టి సారించడం
- • పనిచేసే సమయంలో తక్కువ విరామాలు తీసుకోవడం
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్తో బాధపడేవారు నిపుణులైన వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- తడి ఆరిపోయిన కళ్లకు దృష్టి లోపాలకు సకాలంలో సరైన చికిత్స చేయించుకోవాలి.
- యాంటిగ్లేర్ అద్దాలను వాడాలి
- కంప్యూటర్పై పని చేస్తున్నప్పుడు ప్రతి మూడు గంటలకు ఒకసారి కనీసం 10 నిముషాలపాటు విశ్రాంతి తీసుకోవాలి.
- చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
- కంప్యూటర్పై పని చేస్తున్న సమయంలో కనురెప్పలు కొట్టుకోవడం తగ్గుతుంది. కనుక ఎక్కువసార్లు కంటి రెప్పలు మూసి తెరుస్తూ ఉండాలి.
కంటిని నీటితో కడగడం, అశాస్త్రీయ పద్ధతుల్లో కంటి చుక్కల మందులను వాడటం వల్ల కంటి దృష్టి మరింత మందగించే ప్రమాదం ఉంది. కళ్లు లాగుతున్నా, తరచుగా తలనొప్పి, మెడనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు బాధిస్తున్నా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి తగిన సలహాలు, చికిత్స పొందాలి.
కంప్యూటర్ వాడకం విషయంలో వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంప్యూటర్ ఇన్ స్టాల్ చేసిన ప్రాంతంలో, స్ర్కీన్ పైన ఎక్కువ కాంతి రాకుండా చూసుకోవాలి. కాబట్టి స్ర్కీన్ బ్రైట్ నెస్ ను తగ్గించాలి. మానిటర్ నుంచి వచ్చే కాంతి నేరుగా కళ్ళపై పడకుండా, కాంతిని నిరోధించటానికి యాంటీ గ్లేర్ స్క్రీన్ ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల కళ్ళకు కొంత ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా కలర్స్ ను కూడా సరిపోయే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే కీ-బోర్డ్, మౌస్ ను సులువుగా, ఉపయోగించే విధంగా, మన చేతులకు కంటే కింద ఉండే విధంగా సెటప్ చేసుకోవాలి. అలాగే మానిటర్ మధ్య భాగం, కళ్ళతో పోల్చినప్పుడు 4 – 6 అంగుళాలు కిందకు ఉండాలి. దీనివలన కంటి రెప్పలు, కళ్ళను కొంత వరకు కప్పి ఉంచుతాయి. దీనితో కళ్ళు ఎండిపోవటానికి అవకాశం ఉండదు. అదే విధంగా కంటికి స్క్రీన్ కు మధ్య దూరం 55 నుంచి 75 సెంటీ మీటర్స్ వరకు ఉండాలి.
మీకు ఏవైనా సివిఎస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి కంటి దృష్టి అసాధారణ అంశాలు , వక్రీభవన లోపాల వంటి కంటి సమస్యల పరీక్ష, ప్రెస్బేయోపియా, కంటి కండరాల సమతుల్యతకు పరీక్షలు, కంటి తీరు, కన్నీరు పని చేసే విధులకు సంబంధించిన పరీక్షలు చేయించుకొని మీ కాంతిని కంప్యూటర్ వల్ల వచ్చే సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.