పిల్లలు శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఎదగాలి. అలా పెరిగితేనే పరిపూర్ణంగా ఆటల్లోనూ, చదువులోనూ రాణిస్తారు. ఇందుకోసం వారు రోజూ తీసుకునే ఆహారం కూడా సమతుల పోషకాలతో నిండి ఉండాలి. కానీ హడావుడి కారణంగా వారి స్నాక్, లంచ్ బాక్సుల్లో బిస్కట్స్, చిప్స్ లాంటి అన్ హెల్దీ ఫుడ్ పెడుతున్నారు తల్లిదండ్రులు. దీంతో పిల్లలు శారీరకంగా ఎదగలేకపోతున్నారు. మరి పిల్లల బాక్సుల్లో ఎలాంటి స్నాక్స్ ఉంచాలి.
పొద్దున్నే . . పిల్లలను స్కూలుకు తయారు చేయాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. ఇది ప్రతి ఇంట్లోనూ ప్రతిరోజూ కనిపించే సీనే. ఈ హడావుడి కారణంగా పిల్లల బాక్సుల్లో ఏ బిస్కట్లో, చిప్సో .. పెట్టేస్తుంటారు పెట్టేస్తుంటారు తల్లిదండ్రులు. ఇక లంచ్ బాక్స్ సరేసరి. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులైతే పిల్లాడి ఫుడ్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఉదయాన్నే వేడి వేడి అన్నం.. కాస్త కూర వేసి లంచ్ బాక్స్ పెట్టేస్తారు. కానీ పిల్లలు అది తినకుండా ఇంటికి తెచ్చేస్తారు. కానీ కనీసం పిల్లలు ఇంటికి వచ్చాకైనా వారికి ఇష్టమైనవి, ఆరోగ్యకరమైనవి పెడుతుందాలి. చిప్స్, బిస్కట్లు, శ్యాండ్ విచ్, జామ్ పూసిన బ్రెడ్ లాంటి జంక్ ఫుడ్ లకు బదులు ఇంట్లో తయారుచేసిన రుచికరమైన పోషకాహారం వారికి పెడితే వారి ఆరోగ్యం, పెరుగుదల మెరుగుపడుతుంది.
పౌష్టికాహారం లోపం వల్ల పిల్లల్లో చురుకుదనం లోపిస్తోంది. మలబద్దకం, నిస్సత్తువకు కారణమవుతోంది. దీంతో పరీక్షలంటే భయపడే పరిస్థితి వస్తోంది. అందుకే వారికి నిల్వ పదార్ధాలు పెట్టవద్దు. దీనివల్ల పిల్లల్లో మానసిక పరిపక్వత లేకుండా పోతోంది. నిల్వ ఉండే పదార్థాలు, ఇన్స్టంట్ ఫుడ్స్ లో రుచికోసం అనేక రసాయనాలు వాడతారు. వాటి వల్ల పిల్లలకు అనారోగ్యమే తప్ప.. ఎలాంటి మేలు చేయదని గుర్తుంచుకోండి. సంప్రదాయ పద్ధతిలో వండిన ఆహార పదార్థాల వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుతారు. పిల్లలు వీటిని తినరు.. అని తల్లిదండ్రులే చెప్పవద్దు. అలా చెబితే పిల్లలు దాన్నితినకూడదని భావించే ప్రమాదం ఉంది.

పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఉండి నేర్చుకోవాలంటే వారికి శక్తి ఎంతో అవసరం. హిమోగ్లోబిన్ తగినంత స్థాయిలో ఉంటేనే చురుకుదనం వస్తుంది. ఎనర్జీ, గ్రాస్పింగ్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రోటీన్లు శరీరాన్ని నిర్మిస్తాయి. ఐరన్ అధికంగా ఉండే ఆకుకూరలు లంచ్ బాక్స్ లో ఉంచాలి. స్నాక్ బాక్స్ లో రాగి పల్లీ లడ్డు, సజ్జ అవిశ గింజల లడ్డు, జొన్న కారపూస, రాగి జంతికలు, కొర్ర పాలక్ రిబ్బన్ పకోడీ, రాగి మిల్క్ షేక్, సజ్జ బాదం రోజ్ మిల్క్ షేక్, జొన్న చాట్, రాగి హల్వా, కొర్ర కుడుములు, రాగి క్యారెట్ కేక్, కొర్ర జీరా బిస్కట్లు, రాగి కోకోనట్ బిస్కట్లు పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. జామకాయ, బత్తాయి, నారింజ, దానిమ్మ వంటి పండ్లు ముక్కలు చేయటం కాకుండా.. కాయ లేదా పండు రూపంలోనే పెట్టాలి. వీటి వల్ల వాళ్లకు మంచి పోషకాలు అందుతాయి.
స్కూల్ నుంచి ఇంటికి తిరిగివచ్చిన పిల్లలకు బఠానీ, పల్లీలు చిరుతిండ్లుగా పెట్టాలి. . పుట్నాలు, పల్లీలు వంటి వాటిని బెల్లంతో కలిపి తినుబండారాలు చేయొచ్చు. సజ్జలు, జొన్నలు, కొర్రలతో అనేకరకాల తినుబండారాలను పిల్లలకు ఇష్టమైన రీతిలో తయారుచేయొచ్చు. ఉదయం పూట ఎక్కువ తినే అలవాటు ఆరోగ్యానికి మంచిది. దోస, కీర, ముల్లంగి, క్యారెట్, కొబ్బరి.. తదితర పచ్చి కూరగాయలు తినడం వారికి అలవాటు చేయాలి.
పిల్లలకు స్కూల్లో . . బ్రేక్ టైం తక్కువగా ఉంటుంది. కాబట్టి. . అందుకు అనుగుణంగా .. త్వరగా తినేందుకు వీలుగా స్నాక్స్ తయారు చేసుకోవాలి. ఇంట్లోనే ఇలాంటి స్నాక్స్ తయారు చేయడం వల్ల మరింత పరిశుభ్రంగా ఉంటాయి. మార్కెట్లో దొరికే జంక్ ఫుడ్స్ లో అధిక కొలస్ట్రాల్, ప్రిజర్వేటివ్ రసాయనాలు ఉంటాయి కాబట్టి.. వాటి జోలికి వెళ్లకుండా ఉంటే.. పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు.